లేఖనములు
ఆల్మా 40


40వ అధ్యాయము

క్రీస్తు మనుష్యులందరి పునరుత్థానమును తెచ్చును—వారి పునరుత్థానము యొక్క దినమునకై ఎదురుచూచుటకు నీతిమంతులైన మృతులు పరదైసునకు, దుష్టులు వెలుపలి చీకటిలోనికి వెళ్ళుదురు—పునరుత్థానమందు సమస్తము వాటి సరియైన, పరిపూర్ణమైన రూపమునకు పునఃస్థాపించబడును. సుమారు క్రీ. పూ. 74 సం.

1 నా కుమారుడా, నేను నీతో మరికొంత చెప్పవలసియున్నది; ఏలయనగా మృతుల పునరుత్థానమును గూర్చి నీ మనస్సు కలత చెందియున్నదని నేను చూచుచున్నాను.

2 క్రీస్తు వచ్చు వరకు ఏ పునరుత్థానము లేదని—లేక ఇతర మాటలలో, ఈ మర్త్యమైనది అమర్త్యత్వమును ధరించుకొనదని, ఈ క్షయత అక్షయతను ధరించుకొనదని నేను నీతో చెప్పుచున్నాను.

3 ఆయన మృతుల పునరుత్థానమును తెచ్చును. కానీ నా కుమారుడా, పునరుత్థానము ఇప్పుడే కాదు. ఇప్పుడు నేను నీకొక మర్మమును తెలియజేయుచున్నాను; అయినప్పటికీ, దేవుడు తప్ప ఎవరూ ఎరుగకుండా రహస్యముగా ఉంచబడిన మర్మములు అనేకమున్నవి. కానీ నేను తెలుసుకొనవలెనని దేవుడిని నేను శ్రద్ధగా విచారించిన ఒక విషయమును నీకు చూపెదను—అది పునరుత్థానమును గూర్చినది.

4 మరణము నుండి అందరు బయటకు వచ్చుటకు ఒక సమయము నియమించబడియున్నది. ఆ సమయము ఎప్పుడు వచ్చునో ఎవరూ ఎరుగరు; కానీ నియమించబడిన సమయము దేవునికి తెలియును.

5 ఇప్పుడు, మనుష్యులు మరణము నుండి బయటకు మొదటిసారి, రెండవసారి లేదా మూడవసారి వచ్చెదరా అనునది ముఖ్యమైనది కాదు; ఏలయనగా ఈ సంగతులన్నిటినీ దేవుడు ఎరుగును; మరియు పరిస్థితి ఇదియని—మృతుల నుండి అందరు లేచుటకు ఒక సమయము నియమించబడినదని ఎరుగుట నాకు చాలును.

6 మరణము యొక్క సమయమునకు మరియు పునరుత్థానము యొక్క సమయమునకు మధ్య కొంత వ్యవధి అవసరము.

7 మరణము యొక్క ఈ సమయము నుండి పునరుత్థానము కొరకు నియమించబడిన సమయము వరకు, మనుష్యుల ఆత్మలకు ఏమి జరుగునో నేను విచారించెదను.

8 ఇప్పుడు సమాధినుండి లేచుటకు మనుష్యులకు ఒకటికంటే ఎక్కువ సమయములు నియమించబడెనా అనునది ముఖ్యము కాదు; అందరు ఒక్కసారే మరణించరు అనునది కూడా ముఖ్యము కాదు; దేవునికి అంతయు ఒక్క దినమువలే ఉన్నది, మనుష్యులకు మాత్రమే కాలము కొలవబడును.

9 కావున మృతులలోనుండి లేచుటకు మనుష్యులకు ఒక సమయము నియమించబడియున్నది; మరణము యొక్క సమయము, పునరుత్థానములకు మధ్య వ్యవధి కలదు. ఇప్పుడు ఈ కాల వ్యవధిలో మనుష్యుల ఆత్మలకు ఏమి జరుగునో తెలుసుకొనుటకు నేను ప్రభువును శ్రద్ధగా విచారించితిని మరియు నేను ఎరిగిన విషయము ఇదియే.

10 అందరు మృతులలోనుండి లేచు సమయము వచ్చినప్పుడు, మనుష్యునికి నియమించబడిన అన్ని సమయములను దేవుడు ఎరుగునని వారు తెలుసుకొందురు.

11 ఇప్పుడు మరణము, పునరుత్థానముల మధ్య ఆత్మ యొక్క స్థితిని గూర్చి—ఇదిగో మనుష్యులందరి ఆత్మలు ఈ మర్త్య శరీరము నుండి వెడలిపోయిన వెంటనే, అవి మంచివైనను చెడ్డవైనను మనుష్యులందరి ఆత్మలు వారికి జీవమును అనుగ్రహించిన ఆ దేవుని యొద్దకు తీసుకొనిపోబడునని నాకు ఒక దేవదూత ద్వారా తెలియజేయబడెను.

12 అప్పుడు నీతిమంతులైన వారి ఆత్మలు పరదైసు అని పిలువబడిన సంతోషము యొక్క స్థితి, విశ్రాంతి యొక్క స్థితి, సమాధానము యొక్క స్థితిలోనికి చేర్చుకొనబడును, అక్కడ వారు తమ ఇబ్బందులు, చింతలు మరియు దుఃఖములన్నిటి నుండి విశ్రాంతి పొందుదురు.

13 మరియు అప్పుడు దుష్టుల యొక్క ఆత్మలు, అనగా చెడ్డవారు—వారు ప్రభువు ఆత్మలో ఏ భాగము లేదా పాలు లేకయుండిరి; వారు మంచికి బదులు చెడు కార్యములను ఎంచుకొనిరి; కావున అపవాది యొక్క ఆత్మ వారిలో ప్రవేశించి, వారి ఇంటిని స్వాధీనపరచుకొనెను—వీరు వెలుపలి చీకటిలోనికి త్రోసివేయబడుదురు; అక్కడ ఏడ్పును, రోదనయు, పండ్లుకొరకుటయు ఉండును, ఇది అపవాది యొక్క చిత్తమును బట్టి వారు బందీలుగా కొనిపోబడినందువలన, వారి స్వంత దుర్నీతి మూలముగానున్నది.

14 ఇప్పుడు దుష్టుల యొక్క ఆత్మల స్థితి ఇదియే, అంధకారములో భీతి గొలిపించు భయముతో వారిపై వచ్చు దేవుని ఉగ్రత యొక్క తీవ్రత కొరకు ఎదురుచూచు స్థితి; ఆ విధముగా వారి పునరుత్థానము యొక్క సమయము వరకు వారు ఈ స్థితి యందు మరియు నీతిమంతులు పరదైసునందు నిలిచియుందురు.

15 పునరుత్థానమునకు ముందు ఆత్మ యొక్క ఈ సంతోషకరమైన స్థితి మరియు ఈ దుఃఖకరమైన స్థితియే మొదటి పునరుత్థానము అని గ్రహించిన వారు కొందరున్నారు. చెప్పబడిన మాటల ప్రకారము ప్రాణము లేదా ఆత్మ శరీరమును విడుచుట మరియు సంతోషమునకు లేదా దౌర్భాగ్యమునకు వారు నియమించబడుట ఒక పునరుత్థానముగా పిలువబడవచ్చునని నేను ఒప్పుకొనుచున్నాను.

16 మరియు ఒక మొదటి పునరుత్థానమున్నదని, అది మరణము నుండి క్రీస్తు యొక్క పునరుత్థానము వరకు ఉండిన లేదా ఉన్న లేదా ఉండు వారందరి యొక్క పునరుత్థానమని తిరిగి చెప్పబడియుండెను.

17 ఇప్పుడు ఈ మాదిరిగా చెప్పబడిన ఈ మొదటి పునరుత్థానము ఆత్మల యొక్క పునరుత్థానము మరియు సంతోషము లేదా దౌర్భాగ్యమునకు వారి అప్పగింత అగునని మేము తలంచము. దాని అర్థము ఇదియని నీవు తలంచలేవు.

18 లేదు, అని నేను నీతో చెప్పుచున్నాను; అయితే దాని అర్థము, ఆదాము యొక్క దినముల నుండి క్రీస్తు యొక్క పునరుత్థానము వరకు ఉన్నవారి యొక్క శరీరము, ఆత్మల కలయికయైయున్నది.

19 ఇప్పుడు, చెప్పబడిన వారి యొక్క ఆత్మలు మరియు శరీరములు, అనగా దుష్టులు మరియు నీతిమంతులు అందరివి ఒక్కసారే తిరిగి కలియునో లేదో నేను చెప్పను; వారందరు సమాధినుండి బయటకు వచ్చెదరని లేదా ఇతర మాటలలో వారి పునరుత్థానము, క్రీస్తు యొక్క పునరుత్థానము తరువాత మరణించు వారి పునరుత్థానమునకు ముందు జరుగునని నేను చెప్పుట చాలును.

20 నా కుమారుడా, వారి పునరుత్థానము క్రీస్తు యొక్క పునరుత్థాన సమయమున వచ్చునని నేను చెప్పుట లేదు; కానీ, క్రీస్తు యొక్క పునరుత్థానము మరియు పరలోకములోనికి ఆయన ఆరోహణమగు సమయమున నీతిమంతుల ఆత్మలు మరియు శరీరములు తిరిగి కలిసినవని నా అభిప్రాయముగా నేను చెప్పియున్నాను.

21 అయితే, అది ఆయన పునరుత్థాన సమయమునా లేదా తరువాతనా అని నేను చెప్పను; కానీ ఇంత మట్టుకు నేను చెప్పుచున్నాను, మృతులు బయటకు వచ్చి ఆత్మ, శరీరము రెండూ ఏకమై వారి క్రియలను బట్టి తీర్పుతీర్చబడుటకు దేవుని యెదుట నిలబడుటకై దేవుని చేత నియమించబడిన సమయము వరకు మరణము, శరీరము యొక్క పునరుత్థానము మరియు ఆత్మ యొక్క సంతోషకరమైన లేదా దుఃఖకరమైన స్థితి మధ్య వ్యవధి కలదు.

22 ఇది ప్రవక్తల నోటి ద్వారా చెప్పబడిన ఆ విషయముల యొక్క పునఃస్థాపనను తెచ్చును.

23 ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకు పునఃస్థాపించబడును; ప్రతి అవయవము మరియు కీలు దాని శరీరమునకు పునఃస్థాపించబడును; కనీసము ఒక్క తల వెంట్రుక కూడా నశించిపోదు, కానీ సమస్తము వాటి సరియైన, పరిపూర్ణ రూపమునకు పునఃస్థాపించబడును.

24 ఇప్పుడు, నా కుమారుడా, ప్రవక్తల నోటి ద్వారా చెప్పబడిన పునఃస్థాపన ఇదే—

25 అప్పుడు నీతిమంతులు దేవుని రాజ్యములో ప్రకాశించెదరు.

26 కానీ దుష్టులకు భయంకరమైన మరణము వచ్చును; వారు నీతికి సంబంధించిన సంగతుల విషయమై మరణించెదరు; ఏలయనగా వారు అపవిత్రులు మరియు అపవిత్రమైనదేదియు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేదు; కానీ వారు బయటకు గెంటివేయబడియున్నారు, చెడ్డవైన వారి శ్రమలు లేదా వారి క్రియల యొక్క ఫలములను తినుటకు అప్పగించబడియున్నారు మరియు వారు ఒక చేదు పాత్రలోని మడ్డిని త్రాగుదురు.