సర్వసభ్య సమావేశము
క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడుట
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడుట

యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు చాలా దగ్గరవుతున్నామనే వాస్తవాన్ని ఎదుర్కొనవలసిన అవసరం గతంలో కంటె ఎక్కువగా ఇప్పుడు మనకున్నది.

మోర్మన్ గ్రంథములో వ్రాయబడినట్లుగా, యేసు క్రీస్తు పుట్టుకకు ఆరు సంవత్సరాల ముందు నీతిమంతుడైన లేమనీయ ప్రవక్త సమూయేలు, వారు అప్పటికే విశ్వాస భ్రష్టత్వము చెందిన జనులుగా1 మారిన నీఫై జనులకు మన రక్షకుని పుట్టుక తరువాత వచ్చే సూచనలను గూర్చి ప్రవచించాడు. దురదృష్టవశాత్తు, నీఫైయులలో అనేకులు ఆ సూచనలను తిరస్కరించారు, ఎందుకనగా “క్రీస్తు వంటి ఒక ప్రాణి [రాబోవుట] అనునది తర్కించదగినది కాదు.”2

విచారకరంగా, లేఖన నివేదిక ప్రకారము యూదులలో అనేకులు, అదేవిధానములో సాపేక్షంగా తెలియని మరియు ముఖ్యమైనది కాని గలిలయ జిల్లా నుండి యేసు అనే పేరుగల వ్యక్తిని దీర్ఘ కాలము వేచియున్న మెస్సీయగా అంగీకరించలేకపోయారు.3 వాస్తవంగా హెబ్రీయ ప్రవక్తల చేత చేయబడిన అనేక ప్రవచనాలను నెరవేర్చడానికి వచ్చిన యేసు తిరస్కరించబడ్డారు మరియు సిలువ వేయబడ్డారు కూడా ఎందుకనగా మోర్మన్ గ్రంథ ప్రవక్త జేకబ్ బోధించినట్లుగా, యూదులు “గురిని దాటి చూచుచున్నారు.” చివరకు, “దేవుడు వారి నుండి తన సరళతను తీసివేసెను మరియు వారు దానిని కోరియుండిరి. కాబట్టి వారు గ్రహించలేని అనేక సంగతులను వారికి దయ చేసెను. మరియు వారి దానిని కోరిరి కాబట్టి దేవుడు దానిని వారు తొట్రుపడునట్లు చేసెను” అని జేకబ్ ప్రవచించాడు.4

చెప్పబడిన దానికంటె ఎక్కువ ఆశ్చర్యకరంగా ఏ బోధన, ఏ అద్భుతము మరియు లేమన్, లెమ్యూల్5 చేత ప్రత్యక్షంగా చూడగలిగిన ఏ పరలోకపు దూత ప్రతక్ష్యత కూడా ఒక విషయము సత్యమని కొందరు వ్యక్తులను నమ్మించి, వారి గమనమును, దృక్పథమును లేక నమ్మకాన్ని మార్చుకొనుటకు పురికొల్పే శక్తిని కలిగియున్నట్లు కనబడలేదు. బోధనలు లేదా అద్భుతాలు ఒక వ్యక్తి యొక్క ముందస్తు అభీష్టాలు, కోరికలు లేదా ఆలోచనలతో ఏకీభవించని సందర్భములో ఈవిధంగా ఉంటుంది.

దయచేసి ఈ రెండు వాక్యాల గురించి కొంచెం సేపు విభేదించండి, మొదటిది మనిషి యొక్క మార్గాలను వివరిస్తూ కడవరి దినముల గురించి అపొస్తలుడైన పౌలు చెప్పినది మరియు రెండవది దేవుడు మానవజాతి మధ్య తన పనిని ఎలా చేస్తారో చూపించుచున్న అల్మా ప్రవక్త చెప్పినది. మొదట పౌలు నుండి:

“అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును.

“ఏలాగనగా మనుష్యులు స్వార్ధప్రియులు ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు,

“అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు,

“ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు; …

“ఎల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎల్లప్పుడును పొందలేరు”6 అని అపొస్తలుడైన పౌలు ప్రవచించెను.

యేసు క్రీస్తు సువార్త యొక్క పునాది సూత్రాన్ని వివరిస్తున్న ఆల్మా గ్రంథము నుండి: “ఇప్పుడిది నా యందున్న మూర్ఖత్వమని నీవు తలంచవచ్చును; కానీ, చిన్న మరియు సాధారణమైన విషయముల ద్వారా గొప్ప క్రియలు జరిగించబడునని, చిన్న చర్య అనేక సందర్భములలో జ్ఞానుల గర్వమణచునని నేను నీతో చెప్పుచున్నాను.”7

గొప్ప జ్ఞానము మరియు చాలా ప్రత్యేకమైన నైపుణ్యముతో నింపబడిన ఆధునిక లోకములో మనము జీవిస్తున్నాము. అయినప్పటికీ, బలమైన పునాదిపై కట్టబడని ఈ జ్ఞానము మరియు నైపుణ్యము బలమైన పునాదిపై కట్టబడలేదనే వాస్తవాన్ని దాచును. చివరకు అవి నిజమైన సత్యమునకు, దేవునివైపుకు మరియు బయల్పాటును పొందే శక్తి వైపుకు, ఆత్మీయ జ్ఞానము పొందుటకు మరియు రక్షణకు నడిపించే యేసు క్రీస్తునందు విశ్వాసమును పెంపొందించుటకు నడిపించవు.8

ఆయన ప్రాయశ్చిత్త త్యాగముకు ముందు రాత్రి తోమాకు మరియు మిగిలిన అపొస్తలులకు మన ప్రభువు మాటలను గూర్చి మనము లోతుగా జ్ఞాపకము చేయబడ్డాము: “యేసు—నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.”9

చూచుటకు కన్నులు, వినుటకు చెవులు గలవారు, అనుభూతి చెందుటకు హృదయము గలవారి కొరకు, యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు ఎప్పటికీ దగ్గరవుతున్నామనే వాస్తవాన్ని ఎదుర్కోవలసిన అవసరం గతంలో కంటె ఎక్కువ ముఖ్యంగా మనకున్నది. నిజమే, ఆయన తిరిగి వచ్చినప్పుడు, భూమి మీద ఉండి ఎదురుచూచు వారికి ఇంకా గొప్ప కష్టాలున్నాయి, కానీ ఈ సందర్భములో, విశ్వాసులు భయపడనవసరం లేదు.

ఇప్పుడు “యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ” శీర్షిక క్రింద సంఘ సువార్త విషయాల నుండి ఒక క్షణము నేను ఉదహరిస్తాను.

“రక్షకుడు తిరిగి వచ్చినప్పుడు, తన రాజ్యముగా భూమిని హక్కుగా పొందడానికి ఆయన అధికారము మరియు మహిమతో వచ్చును. ఆయన రెండవ రాకడ వెయ్యెండ్ల పరిపాలన యొక్క సంఘటన ప్రారంభాన్ని సూచించును.

“రెండవ రాకడ దుష్టులకు భయం కలిగించి, దుఃఖపడే సమయంగా ఉంటుంది, కానీ నీతిమంతులకు సమాధానముగల దినముగా ఉంటుంది. ప్రభువు ఇలా ప్రకటించారు:

“ఏలయనగా జ్ఞానము కలిగి, సత్యమును స్వీకరించి, పరిశుద్ధాత్మను తమ మార్గదర్శిగా పొందినవారు మోసగించబడలేదు—వారు నరకబడి అగ్నిలో వేయబడరు, కానీ వారు ఆ దినమున నిలిచియుందురని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

“ఒక స్వాస్థ్యముగా భూమి వారికి ఇవ్వబడును; వారు అభివృద్ధి చెంది బలపడుదురు మరియు వారి పిల్లలు పాపము లేకుండా ఎదిగి రక్షణ పొందెదరు.

“ఏలయనగా ప్రభువు వారి మధ్యనుండును, ఆయన మహిమ వారిమీద నుండును, ఆయన వారి రాజుగా, శాసనకర్తగా ఉండును (సిద్ధాంతము మరియు నిబంధనలు 45:57–59.).” 10

యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మన సిద్ధపాటులో, విశ్వాసుల కొరకు ఓదార్పునిచ్చే వ్యాఖ్యానాన్ని పాత నిబంధన ప్రవక్తయైన ఆమోసు నుండి నేను ఇస్తాను: “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.”11

ఈ ఆత్మయందు, ఈ రోజు లోకమునకు ప్రభువు యొక్క ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈమధ్య మనకు ప్రేరేపించబడిన సలహా ఇచ్చారు: “యేసు క్రీస్తు యొక్క సువార్త పశ్చాత్తాపము యొక్క సువార్త. రక్షకుని ప్రాయశ్చిత్తం కారణంగా మారుతూ, అభివృద్ధి చెందుతూ, మరింత స్వచ్ఛంగా మారడానికి ఆయన సువార్త ఒక ఆహ్వానాన్ని ఇస్తుంది. ఇది నిరీక్షణ, స్వస్థత మరియు పురోగతి యొక్క సువార్త. ఈ విధంగా, సువార్త అనేది ఆనందం యొక్క సందేశమైయున్నది! మనం ముందుకు వేసే ప్రతి చిన్న అడుగుతో మన ఆత్మలు ఆనందిస్తాయి.”12

దేవుని వాస్తవికతను గూర్చి మరియు జీవితపు తక్కువ, ఉన్నత స్థాయిలు రెండిటి నుండి లెక్కలేనంతమంది జనుల యొక్క అనుదిన జీవితంలో అద్భుతాలను ధృవీకరిస్తూ నేను నిస్సందేహంగా సాక్ష్యమిస్తున్నాను. నిజమే, వాటి దైవిక మూలము కారణంగా మరియు వాటిని బాగా ఎరుగని కొందరు అపహాస్యం చేసే అవకాశమున్నది గనుక అనేకమైన పరిశుద్ధ అనుభవాలు అరుదుగా చెప్పబడతాయి.

ఈ సందర్భములో, మోర్మన్ గ్రంథ ప్రవక్తలలో చివరివాడైన మొరోనై మనకు జ్ఞాపకము చేయును:

“మరలా, దేవుని బయల్పాటులను తిరస్కరించి, అవి ముగిసిపోయినవని, ఇక బయల్పాటులు, ప్రవచనములు, బహుమానములు, స్వస్థతలు, భాషలతో మాట్లాడుట మరియు భాషల యొక్క అనువాదములు లేవని చెప్పు వారితో నేను మాట్లాడుచున్నాను;

“నేను మీతో చెప్పునదేమనగా, ఈ విషయములను తిరస్కరించువాడు క్రీస్తు యొక్క సువార్తను యెరుగడు; అనగా, అతడు లేఖనములను చదువలేదు; చదివిన యెడల, అతడు వాటిని గ్రహించలేదు.

“ఏలయనగా దేవుడు నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని, ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఛాయయైనను లేదని మనము చదువుట లేదా?”13

యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ఎదురు చూస్తున్నప్పుడు, తన పరిచర్య ముగింపులో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ చేత ఇవ్వబడిన యథార్థముగా ప్రేరేపించబడిన ప్రవచనాత్మక ప్రకటనతో నా ప్రసంగాన్ని ముగిస్తాను: “మనము ఒక గొప్ప కార్యములో ముందుకు సాగుటలేదా? వెనుకకు మరలక ముందుకు సాగుడి. సహోదర [సహోదరీలారా] ధైర్యము తెచ్చుకొనుడి; జయము పొందుటకు ముందుకు సాగుడి! మీ హృదయములు సంతోషించి, గొప్ప ఆనందమును పొందనీయుడి.”14 దానికి నేను నా సాక్ష్యమును జోడిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో , ఆమేన్.