సర్వసభ్య సమావేశము
శిష్యత్వము యొక్క మాదిరులు
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


శిష్యత్వము యొక్క మాదిరులు

క్రీస్తు గురించి, ఆయన మార్గముల గురించి నేర్చుకోవడం, ఆయనను తెలుసుకొని, ప్రేమించడానికి మనల్ని నడిపిస్తుంది.

విశ్వాసము యొక్క మాదిరి

ఈ ఉదయం ఉత్తర అమెరికాలోని మా ఇద్దరు పిల్లలు, ముగ్గురు మనుమలు మరియు దాదాపు ప్రపంచంలో సగం మంది తూర్పున అద్భుతంగా ఉదయిస్తున్న సూర్యుని ప్రకాశాన్ని చూసారు. ఆఫ్రికాలో మా మిగిలిన ముగ్గురు పిల్లలు, ఏడుగురు మనుమలు మరియు ప్రపంచంలో మిగిలిన సగభాగము సూర్యుడు పశ్చిమాన క్షితజములో మునిగిపోవడంతో క్రమంగా చీకటి వారిపైకి చేరడాన్ని చూసారు.

పగలు మరియు రాత్రి ప్రారంభంలో ఈ కాలాతీతమైన స్థిరత్వం అనేది మన జీవితాలను నియంత్రించే వాస్తవాల యొక్క రోజువారీ జ్ఞాపకార్థము, దానిని మనం మార్చలేము. ఈ నిత్య వాస్తవాలతో మనము చేసే దానిని గౌరవించి, సమలేఖనం చేసినప్పుడు, మనము అంతర్గత శాంతిని, సామరస్యాన్ని అనుభవిస్తాము. మనము అలా చేయనప్పుడు, మనం అస్థిరంగా ఉంటాము మరియు మనము ఆశించినట్లుగా విషయాలు పని చేయవు.

పగలు మరియు రాత్రి అనేది భూమిపై జీవించిన ప్రతీఒక్కరికీ, అవి వాస్తవముగా ఉన్నట్లుగా దేవుడు ఇచ్చిన మాదిరులకు ఒక ఉదాహరణ. మన స్వంత కోరికల ప్రకారంమనం వ్యవహరించి, దాని పర్యవసానము నుండి బయటపడలేము అనేది మన మానవ ఉనికి యొక్క సంపూర్ణ సత్యం. నేను సర్వసభ్య సమావేశానికి రావడానికి శరీర గడియారాన్ని ఒకరోజులో 10 గంటలు వెనక్కి మార్చి, ఆఫ్రికా నుండి విమానము ఎక్కే ప్రతీసారి, అది నాకు గుర్తు చేయబడింది.

మనము గమనించడానికి శ్రద్ధ తీసుకున్నప్పుడల్లా, మన జీవితాలను పరిపాలించడానికి సత్యము యొక్క తగినన్ని సాక్ష్యాలను పరలోక తండ్రి మనకు ఇచ్చారని మనము చూస్తాము, కాబట్టి మనము ఆయనను తెలుసుకుంటాము మరియు శాంతి, ఆనందము యొక్క దీవెనలను కలిగియుంటాము.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా, ప్రభువు యొక్క ఆత్మ ఇలా ధృవీకరిస్తుంది, “మరలా, మీరు మోసపోకుండునట్లు అన్ని విషయములలో ఒక మాదిరిని నేను మీకు ఇచ్చెదను; ఏలయనగా సాతాను భూమియందంతట సంచరించుచూ జనములను మోసగించుటకు వెళ్ళుచున్నాడు.”1

క్రీస్తు విరోధి కొరిహోర్ దేవుని ఉనికిని మరియు క్రీస్తు యొక్క రాకడను నమ్మకుండా, అటువంటి మోసంలో పడిపోయాడు. అతడికి ప్రవక్త ఆల్మా ఇలా సాక్ష్యమిచ్చాడు, “సమస్తమును ఒక దేవుడున్నాడని సూచించుచున్నవి; భూమి మరియు దాని ముఖముపై ఉన్న సమస్తము, దాని గమనము మరియు తమ క్రమమైన రీతిలో కదులు సమస్త గ్రహములు కూడా సర్వోన్నతుడైన సృష్టికర్త ఉన్నాడని సాక్ష్యమిచ్చుచున్నవి.”2

అతడు నమ్మడానికి ముందు ఒక సూచన ఇమ్మని కొరిహోర్ పట్టుబట్టినప్పుడు, ఆల్మా అతడిని మూగవానిగా చేసాడు. తన బాధ చేత వినయముగా చేయబడి, కొరిహోర్ దయ్యము చేత మోసగించబడినట్లు స్వేచ్ఛగా ఒప్పుకొన్నాడు.

మనం మోసగించబడనవసరం లేదు. తెలివిగల జీవితం యొక్క అద్భుతాన్ని మన యెదుట నిరంతరం మనం చూడగలము. లెక్కలేనన్ని నక్షత్రాలు మరియు నక్షత్రమండలాలతో అలంకరించబడిన పరలోకము యొక్క అద్భుతాలపై క్లుప్త దృష్టి మరియు ఆలోచన ఆ నమ్మిన హృదయం యొక్క ఆత్మను, “నా దేవా, నీవు ఎంత గొప్పవాడివి!”3 అని ప్రకటించడానికి ప్రేరేపిస్తుంది.

అవును, మన పరలోక తండ్రియైన దేవుడు జీవిస్తున్నాడు మరియు బహు విధాలుగా అన్ని సమయాలందు ఆయన తనకుతానే మనకు ప్రత్యక్షపరచుకుంటున్నాడు.

వినయము యొక్క మాదిరి

కానీ అంగీకరించడానికి, విశ్వసించడానికి మరియు దేవునిలో కొనసాగడానికి, మన హృదయాలు సత్య స్వరూపియైన ఆత్మను స్వీకరించాలి. విశ్వాసానికి ముందు వినయము కలిగియుండాలని ఆల్మా బోధించాడు.4 దేవుని యొక్క ఆత్మను పొందడానికి విశ్వాసమును, నిరీక్షణను కలిగియుండడానికి “హృదయమందు సాత్వీకులు మరియు దీనమనస్సు గలవారు” కాని వారెవరికైనా అది అసాధ్యమని మోర్మన్ చేర్చాడు. 5 లోకము యొక్క మహిమకు ప్రాధాన్యతను ఇచ్చే వారు ఎవరైనా “దేవునికి శత్రువు” అని 6 రాజైన బెంజిమెన్ ప్రకటించాడు.

యేసు క్రీస్తు తాను నీతిమంతుడు మరియు పరిశుద్ధుడు అయినప్పటికీ, నీతి యావత్తు నెరవేర్చడానికి బాప్తిస్మమునకు అప్పగించుకొనుట ద్వారా, దేవుని యెదుట వినయం ఆయన శిష్యుల యొక్క ప్రధాన లక్షణమని నిరూపించాడు.7

క్రొత్త శిష్యులందరూ బాప్తిస్మపు విధి ద్వారా, దేవుని ముందు వినయము ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా, “ఎవరైతే దేవుని యెదుట తమనుతాము తగ్గించుకొని, బాప్తిస్మము పొందవలెనని కోరిక కలిగియుండి, విరిగిన హృదయము, నలిగిన ఆత్మతో వస్తారో వారందరూ … బాప్తిస్మము ద్వారా ఆయన సంఘములోనికి స్వీకరించబడుదురు.”8

వినయము శిష్యుని హృదయాన్ని పశ్చాత్తాపము మరియు విధేయత వైపు మళ్ళిస్తుంది. అప్పుడు దేవుని ఆత్మ ఆ హృదయానికి సత్యమును తేగలదు మరియు అది ప్రవేశాన్ని కనుగొంటుంది.9

వినయం లేకపోవడమే ఈ కడవరి దినాలలో అపొస్తలుడైన పౌలు యొక్క ప్రవచనము నెరవేరడానికి తోడ్పడుతున్నది.

“ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు,

“అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు.”10

ఆయనను గూర్చి నేర్చుకోమనే రక్షకుని యొక్క ఆహ్వానము, లోకము యొక్క ప్రలోభాల నుండి దూరంగా వెళ్ళమని మరియు ఆయన వలే—హృదయమందు సాత్వీకులు మరియు దీనమనస్సు గలవారు, వినయము గలవారిగా మారమనే ఆహ్వానము. అప్పుడు మనము ఆయన కాడిని పైకెత్తుకొని, అది సులువైనదని కనుగొంటాము—అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చాలా అనర్గళంగా, పలుమార్లు మనకు బోధించినట్లుగా, ఆ శిష్యత్వము భారము కాదు కానీ సంతోషకరమైనది.

ప్రేమ యొక్క మాదిరి

క్రీస్తు గురించి, ఆయన మార్గముల గురించి నేర్చుకోవడం, ఆయనను తెలుసుకొని, ప్రేమించడానికి మనల్ని నడిపిస్తుంది.

వినయము గల వైఖరితో మన పూర్ణాత్మతో తండ్రి అయిన దేవుడిని తెలుసుకొని ప్రేమించుట మరియు దాపరికము లేకుండా మన వలే ఇతరులను ప్రేమించుట నిజంగా సాధ్యమని ఆయన మాదిరి ద్వారా చూపించాడు. భూమి మీద ఆయన పరిచర్యలో ఆయన తన చిత్తాన్ని, తన శరీరాన్ని బలిపీఠంపై పెట్టుట ఆయన సువార్త స్థాపించబడిన ఈ సూత్రాల అన్వయానికి ఒక మాదిరిగా ఉన్నది. రెండు సూత్రాలు మనపై కాకుండా ఇతరులపై దృష్టిసారించడానికి బలవంతం చేస్తాయి మరియు అవి మనం ఇతరులతో ఎలా సంబంధం కలిగియున్నామనే దాని గురించినవే కానీ, వ్యక్తిగత సంతృప్తి లేదా మహిమను కోరుట గురించినవి కాదు.

ఇందులోని అద్భుతమైన పరిహాసము ఏమిటంటే, దేవుడిని మరియు ఇతరులను ప్రేమించడంపై మన శ్రేష్ఠమైన ప్రయత్నాలను మనం కేంద్రీకరించినప్పుడు, ఆ అనుభవం కలిగించే సంపూర్ణ శాంతి మరియు ఆనందంతో దేవుని కుమారులు, కుమార్తెలుగా మన స్వంత నిజమైన దైవిక విలువను మనం కనుగొనగలుగుతాము.

ప్రేమ మరియు సేవ ద్వారా మనము దేవునితో ఒకటవుతాము మరియు ఒకరితో ఒకరం ఏకమవుతాము. అప్పుడు ఆ శుద్ధమైన ప్రేమను గూర్చి పరిశుద్ధాత్మ సాక్ష్యమును, “[అతడు] ఇంతకు ముందు రుచి చూచిన వాటన్నిటి కంటే అత్యంత మధురముగా ఉన్నదని” లీహై చెప్పిన ఫలమును11 మనము పొందగలము.

తండ్రిని ప్రేమించుట మరియు మనల్ని ప్రేమించుట యొక్క మాదిరిని ఏర్పరచడానికి తన సామర్థ్యముతో అన్నిటిని ఇవ్వడం మరియు చేయడం ద్వారా క్రీస్తు అందుకున్న కిరీటము, సమస్త శక్తిని పొందడం, తండ్రి కలిగియున్న సమస్తమును, అనగా మహోన్నతస్థితిని పొందడం.12

ఆయన అద్వితీయ కుమారుని నామములో ప్రతీరోజు వ్యక్తిగత మరియు కుటుంబ ప్రార్థనలో తండ్రితో సంబంధం కలుపుకొనుట, వ్యక్తిగత మరియు కుటుంబ లేఖన అధ్యయనం ద్వారా వారి గురించి కలిసి నేర్చుకొనుట, సబ్బాతుదినమును కలిసి ఆచరించుట మరియు వ్యక్తిగతంగా ప్రస్తుతం చలామణిలో ఉన్న దేవాలయ సిఫారసును కలిగియుండి, మనకు సాధ్యమైనంత తరచుగా కలిసి వెళ్ళి దానిని ఉపయోగించుట వంటి పరిశుద్ధమైన అలవాట్లతో దేవునిపట్ల మరియు మన పొరుగువారి పట్ల శాశ్వతమైన ప్రేమను మన ఆత్మలలో పెంపొందించుకోవడానికి మన అవకాశం ఇంటి నుండి మొదలవుతుంది.

తండ్రి మరియు కుమారుని గూర్చి మన జ్ఞానము మరియు ప్రేమయందు మనలో ప్రతీఒక్కరు స్వయంగా ఎదిగినప్పుడు, మనము ఒకరి కొరకు ఒకరం ప్రశంసయందు, ప్రేమయందు ఎదుగుతాము. ఇంటి వెలుపల ఇతరులను ప్రేమించి, సేవ చేయడానికి మన సామర్థ్యము గొప్పగా హెచ్చించబడుతుంది.

ఇంటివద్ద మనము చేసేది శుద్ధిచేయబడిన శాశ్వతమైన మరియు ఆనందకరమైన శిష్యత్వము. నేను, నా భార్య గ్లాడిస్ మా గృహములో ఆనందించే పునఃస్థాపించబడిన సువార్త యొక్క మధురమైన దీవెనలు ఇంటివద్ద దేవుడిని తెలుసుకొని, గౌరవించడం వలన మరియు మా సంతానముతో ఆయన ప్రేమను పంచుకొనుట వలన వచ్చినవి.

సేవ యొక్క మాదిరి

ఇంటివద్ద బోధింపబడి వృద్ధి చేయబడిన దేవునిపట్ల ప్రేమ మరియు ఒకరికొకరికి సేవ, ఇంటి వెలుపల ఇతరులకు సేవ కాలక్రమంలో దాతృత్వముగా ఎదుగుతుంది.

దేవుని రాజ్యములో సమర్పించబడిన సేవ యొక్క మాదిరితో ఇది ప్రతిధ్వనిస్తుంది, అది ప్రభువు యొక్క జీవిస్తున్న ప్రవక్తలు మరియు అపొస్తలుల చేత మనకు రుజువు చేయబడింది. మనము వారితో ఒకటవుతాము.

అప్పుడు వారి ద్వారా “ప్రతీ ఆలోచనలో” ప్రభువును చూచుట మనకు సాధ్యము చేయబడుతుంది, ఆవిధంగా మనము “సందేహించము” లేదా “భయపడము.”13

ప్రభువు యొక్క జీవిస్తున్న ప్రవక్తలు మరియు అపొస్తలుల వలె, మనము “మనుష్యులందరి యెడల, విశ్వాస గృహము యెడల దాతృత్వముతో నిండిన ఆంత్రములతో, నిరంతరము మన ఆలోచనలను [అలంకరించిన] సుగుణము[తో] ముందుకు వెళ్ళగలము; … [మరియు మన] ఆత్మస్థైర్యము దేవుని సముఖమందు బలమైనదిగా [ఎదుగును]; యాజకత్వపు సిద్ధాంతము ఆకాశమునుండి కురియు మంచుబిందువుల వలే [మన ఆత్మల] మీదకు [దిగివచ్చును].”

ప్రభువు యొక్క జీవిస్తున్న ప్రవక్తలు మరియు అపొస్తలులతోపాటు, మనము కూడా సమర్పించబడిన సేవ ద్వారా బలపరచబడిన విశ్వాసము యొక్క సద్గుణ వృత్తములో చేరగలము, దానిలో “పరిశుద్ధాత్మ [మన] స్థిర సహచరునిగాయుండును, [మన] దండము నీతి సత్యముల యొక్క మారని దండముగానుండును; [మన] ఏలుబడి నిత్య ఏలుబడిగానుండును, బలవంతము లేకుండా నిరంతరము అది [మన] యొద్దకు [ప్రవహించును].”14 ఏలయనగా ఇది తండ్రి ప్రణాళిక యొక్క వాగ్దానమైయున్నది. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.