అత్యున్నతుడైన దేవుని నామము ధన్యమగును గాక
యెరూషలేము లోనికి యేసు క్రీస్తు యొక్క విజయోత్సాహ ప్రవేశము మరియు తరువాతి వారంలో జరిగిన సంఘటనలు నేడు మన జీవితాల్లో మనం అన్వయించగల సిద్ధాంతాన్ని ఉదహరిస్తాయి.
ఇంతకుముందు చెప్పినట్లుగా, నేడు ఈ మట్టల ఆదివారం మనం యేసు క్రీస్తును గౌరవించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులతో చేరుతున్నాము. సుమారు 2000 సంవత్సరాల క్రితం, యేసు క్రీస్తు యొక్క మర్త్య పరిచర్య చివరి వారం ప్రారంభాన్ని మట్టల ఆదివారం గుర్తించింది. మానవ చరిత్రలో అది అత్యంత ముఖ్యమైన వారము.
వాగ్దానం చేయబడిన మెస్సీయగా యెరూషలేము లోనికి ఆయన విజయోత్సాహ ప్రవేశంలో యేసును స్వాగతించడంతో ప్రారంభమైనది ఆయన సిలువధారణ మరియు పునరుత్థానముతో ముగిసింది.1 దైవిక రూపకల్పన ద్వారా, ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ఆయన మర్త్య పరిచర్యతో ముగిసింది, నిత్యత్వము కొరకు మన పరలోక తండ్రితో జీవించడాన్ని మనకు సాధ్యం చేసింది.
“గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసును”2 చూడడానికి పట్టణ ద్వారాల వద్ద నిలబడిన జనసమూహముతో ఆ వారము ప్రారంభమైనదని లేఖనాలు మనకు చెప్తాయి. వారు “ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.”3
చాలా కాలం నాటి ఆ బైబిలు వృత్తాంతం, ఘానాలోని టకొరాడిలో సంఘ నియామకంపై ఉన్న సమయాన్ని నాకు గుర్తుచేస్తుంది. విశేషంగా, నేను మట్టల ఆదివారం అక్కడున్నాను.
మింట్సిన్ ఘానా స్టేకును ఏర్పాటు చేయడానికి టకొరాడి ఘానా స్టేకును విభజించడానికి నేనక్కడ ఉన్నాను. నేడు ఘానాలో 1,00,000 మందికి పైగా సంఘ సభ్యులున్నారు.4 (ఈ రోజు మాతో ఉన్న ఘనాలోని అక్రాకు చెందిన గా మాంట్సే, రాజు నియి టాకీ టెయికోత్సురు IIని మేము స్వాగతిస్తున్నాము.) ఈ పరిశుద్ధులను కలుసుకొని, నేను ప్రభువుపట్ల వారి గాఢమైన ప్రేమను, భక్తిని చూసాను. వారి కోసం నా గాఢమైన ప్రేమను నేను వ్యక్తపరిచాను మరియు సంఘ అధ్యక్షుడు వారిని ప్రేమించారని చెప్పాను. యోహాను చేత వ్రాయబడిన రక్షకుని మాటలను నేను సూచించాను: “నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.”5 “సమావేశం యొక్క ప్రధాన ఇతివృత్తం ప్రేమ”6 అని వారు పరిగణించారు.
సంఘ భవనంలో ప్రియమైన ఆ సహోదర సహోదరీలు, వారి కుటుంబాలు కూర్చున్న వరుసలను పైనుండి క్రిందికి చూసినప్పుడు, వారి ముఖాలలో యేసు క్రీస్తునందు విశ్వాసము మరియు సాక్ష్యము యొక్క కాంతిని నేను చూడగలిగాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన సంఘములో వారు భాగం కావాలని కోరుతున్నట్లు నేను భావించాను. గాయకబృందం పాడినప్పుడు, వారు దేవదూతల్లా పాడారు.
ఆనాటి మట్టల ఆదివారం, యెరూషలేము ద్వారాల వద్ద తమ చేతుల్లో ఖర్జూరపుమట్టలు పట్టుకొని … : జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక”7 అని కేకలువేసిన వారివలె ఆయనకు నివాళులర్పించడానికి సమకూడిన యేసు క్రీస్తు యొక్క శిష్యులు వీరు.
దగ్గరలోని స్థానిక సంఘ సభ్యులు కూడా మట్టల ఆదివారాన్ని గౌరవిస్తున్నారు. నేను వేదిక పైనుండి మాట్లాడుతున్నప్పుడు, కిటికీ బయట వారు ఈ ఫోటోలో ఉన్నవారిలా తమ చేతుల్లో ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఊపుతూ వీధిలో ఆనందంగా నడవడాన్ని నేను గమనించాను. ఆ దృశ్యాన్ని నేనెప్పటికీ మరచిపోలేను, మేమందరం ఆరోజు రాజులకు రాజును ఆరాధిస్తున్నాము.
“యెరూషలేములోనికి యేసు ప్రవేశించినప్పుడు స్వాగతించడానికి ఊపిన ఖజ్జూరపు మట్టలను మాత్రమే జ్ఞాపకముంచుకోవడం కాకుండా, ఆయన చేతుల్లోని గురుతులను కూడా గుర్తుంచుకోవడం ద్వారా మట్టల ఆదివారాన్ని నిజంగా పరిశుద్ధంగా చేయమని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని హెచ్చరించారు. తర్వాత, “‘నా యరచేతులమీదనే నిన్ను చెక్కియున్నాను,’ అంటూ ‘నేను నిన్ను మరువను’ అనే రక్షకుని వాగ్దానం గురించి మాట్లాడిన” యెషయాను అధ్యక్షులు నెల్సన్ సూచించారు.8
మర్త్యత్వము కష్టమైనదని ప్రభువుకు ప్రత్యక్షంగా తెలుసు. ఆయన “వీటన్నిటికంటె హీనమైనవాటిని అనుభవించారని”9 ఆయన గాయాలు మనకు గుర్తుచేస్తాయి, తద్వారా మనం బాధపడినప్పుడు ఆయన మనకు సహాయపడవచ్చు మరియు “నీ మార్గమున నిలువుము,”10 “దేవుడు నిరంతరము [మనకు] తోడైయుండును”11 అనే ఆయన మార్గములో నిలిచేందుకు మనకు మాదిరిగా ఉండవచ్చు.
మట్టల ఆదివారము కేవలం ఒక సంఘటన కాదు, చరిత్రలో తేదీ, సమయం మరియు స్థలంతో ఉన్న మరొక పేజీ కాదు. యెరూషలేము లోనికి యేసు క్రీస్తు యొక్క విజయోత్సాహ ప్రవేశము మరియు తరువాతి వారంలో జరిగిన సంఘటనలు నేడు మన జీవితాల్లో మనం అన్వయించగల సిద్ధాంతాన్ని ఉదహరిస్తాయి.
యెరూషలేములో ముగిసే ఆయన పరిచర్యతో అల్లుకున్న కొన్ని నిత్య సిద్ధాంతాలను చూద్దాం.
మొదటిది, ప్రవచనము. ఉదాహరణకు, యెరూషలేము లోనికి యేసు క్రీస్తు యొక్క విజయోత్సాహ ప్రవేశము గురించి, ఆయన ఒక గాడిదపై ఎక్కి వస్తారని కూడా పాత నిబంధన ప్రవక్త జెకర్యా ప్రవచించాడు.12 పట్టణంలోనికి ప్రవేశించడానికి ఆయన సిద్ధపడుతుండగా, యేసు ఇలా అంటూ ఆయన పునరుత్థానము గురించి ముందుగా చెప్పారు:
“ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి,
“ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.”13
రెండవది, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము. “పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని తెలుసుకోలేడు,”14 అని జోసెఫ్ స్మిత్ బోధించారు. “మిమ్మును అనాథలనుగా విడువను,”18 అని తన శిష్యులకు15 ప్రభురాత్రి భోజనము వద్ద16 మేడ గదిలో17 రక్షకుడు వాగ్దానమిచ్చారు. సువార్త సత్యాలను ముందుకు తీసుకువెళ్ళడానికి వారు ఒంటరివారు కాదు, వారిని నడిపించడానికి పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ బహుమానాన్ని వారు కలిగియుంటారు. “శాంతి మీ కనుగ్రహించి వెళ్ళుచున్నాను: నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను: లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు.”19 పరిశుద్ధాత్మ వరముతో మనము అదే అభయాన్ని కలిగియున్నాము; మనం “ఎల్లప్పుడు ఆయన ఆత్మను [మనతో] కలిగియుండెదము”20 మరియు “పరిశుద్ధాత్మ శక్తి ద్వారా [మనము] అన్నిసంగతుల యొక్క సత్యమును తెలుసుకొనగలము.”21
మూడవది, శిష్యత్వము. నిజమైన శిష్యత్వము అనగా విఫలము కాని నిబద్ధత, నిత్య చట్టాలకు విధేయత, అన్నిటికంటే ముందు దేవుని ప్రేమ. ఏ మాత్రం సందేహింపనిది. ఖజ్జూరపు మట్టలతో నివాళులర్పించిన సమూహము ఆయనను మెస్సీయగా కొనియాడారు. సరిగ్గా ఆయన అదే. వారు ఆయన వైపు, ఆయన అద్భుతాలు మరియు ఆయన బోధనల వైపు ఆకర్షించబడ్డారు. కానీ చాలా మందికి ప్రశంసలు నిలువలేదు. “హోసన్నా”22 అని మొదట అరిచిన వారు, వెంటనే “వానిని సిలువవేయుము”23 అని కేకలువేసారు.
నాల్గవది, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము.24 మట్టల ఆదివారం తర్వాత, ఆయన చివరి రోజులలో, గెత్సేమనేలో వేదన నుండి ఆయన విచారణను ఎగతాళి చేయడం, సిలువపై ఆయన చిత్రహింస మరియు అరువు తెచ్చుకున్న సమాధిలో ఆయన ఖననం వరకు ఆయన విశేషమైన తన ప్రాయశ్చిత్తాన్ని చేపట్టారు. అక్కడితో అది ఆగిపోలేదు. పరలోక తండ్రి యొక్క పిల్లలందరి విమోచకునిగా ఆయన పిలుపు యొక్క ఘనతతో, మూడు రోజుల తర్వాత, ఆయన ప్రవచించినట్లుగా ఆ సమాధి నుండి ఆయన పునరుత్థానుడై25 బయటకు వచ్చారు.
యేసు క్రీస్తు యొక్క సాటిలేని ప్రాయశ్చిత్తం కొరకు మనం నిరంతరం కృతజ్ఞత కలిగియున్నామా? ఇప్పుడు మనం దాని శుద్ధీకరణ శక్తిని అనుభవిస్తున్నామా? అందుకే, మన రక్షణ యొక్క ఆదియు అంతమునైయున్న యేసు క్రీస్తు మనందరినీ రక్షించడానికి యెరూషలేము వెళ్ళారు. ఆల్మాలోని ఈ మాటలు ప్రత్యేకంగా ముఖ్యమైనవి: “మీరు హృదయము యొక్క మార్పును అనుభవించిన యెడల మరియు విమోచించు ప్రేమ గీతమును పాడవలెనని మీకనిపించిన యెడల, ఇప్పుడు మీరు ఆలాగున భావించగలరా? అని నేను అడుగుచున్నాను.”26 టకొరాడిలో ఆ మట్టల ఆదివారంనాడు గాయకబృందం “విమోచన ప్రేమ గీతాన్ని” ఆలపించిందని నేను నిజంగా చెప్పగలను.
ఆయన మర్త్య పరిచర్య యొక్క విధిలేని ఆ చివరి వారం, యేసు క్రీస్తు పదిమంది కన్యకల ఉపమానమును ఇచ్చారు.27 తమ చేతుల్లో ఖజ్జూరపు మట్టలతో కాదు, కానీ వారిలోనున్న సువార్త వెలుగుతో ఆయనను స్వీకరించడానికి సిద్ధపడిన వారి కోసం ఆయన తిరిగి రావడం గురించి ఆయన బోధిస్తున్నారు. ఆయన మార్గాలను, ఆయన సత్యాలను జీవించడానికి మరియు ఆయన వెలుగును పంచుకోవడానికి సుముఖతను వర్ణించడానికి వెలుగుతున్న దివిటీలు, వాటిని మండించడానికి అదనపు నూనె చిత్రాన్ని ఆయన ఉపయోగించారు.
ఆ కథ మీకు తెలుసు. పదిమంది కన్యకలు సంఘాన్ని సూచిస్తున్నారు, పెండ్లికొడుకు యేసు క్రీస్తును సూచిస్తున్నాడు.
పదిమంది కన్యకలు తమ దివిటీలు పట్టుకొని “పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిరి.”28 ఐదుగురు బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి మరియు ఐదుగురు బుద్ధి లేనివారు తమతోకూడ నూనె తీసికొనిపోలేదు గనుక వారి దివిటీలు ఆరిపోవుచున్నవి. “ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి”29 అను కేక వినబడినప్పుడు, “జ్ఞానము కలిగి, సత్యమును స్వీకరించి, పరిశుద్ధాత్మను తమ మార్గదర్శిగా పొందిన”30 ఐదుగురు “ఆయన మహిమ వారిమీద నుండునట్లు,”32 “వారి రాజు మరియు శాసనకర్త”31 కొరకు సిద్ధంగా ఉండిరి. మిగతా ఐదుగురు నూనె కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. వారు లేకుండానే ఊరేగింపు ముందుకు సాగిపోయింది. వారు తలుపుతట్టి, లోనికి రానివ్వమని బ్రతిమిలాడినప్పుడు, “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను”33 అని ప్రభువు జవాబిచ్చారు.
ఆయన మనతో, “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను!” అని చెప్పినయడల మీరెలా భావిస్తారు?
పదిమంది కన్యకల వలె మనము దివిటీలను కలిగియున్నాము; కానీ మన దగ్గర నూనె ఉందా? లోకపు ఒత్తిళ్ళచేత కొంతమంది సరిగ్గా సిద్ధపడేందుకు తీరికలేకుండా ఉండి, అతితక్కువ ఆధ్యాత్మిక స్థాయిని మాత్రమే కలిగియున్నారని నేను భయపడుతున్నాను. సజీవులైన ప్రవక్తలు, ముఖ్యంగా అధ్యక్షులు నెల్సన్, ఆయన సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తలుల మాటలు మరియు ప్రవచనాలను నమ్మడం, వాటిపై పనిచేయడం నుండి నూనె వస్తుంది. పరిశుద్ధాత్మను మనం విని, అనుభవించి, ఆ దైవిక నడిపింపు మీద పనిచేసినప్పుడు, నూనె మన ఆత్మలను నింపుతుంది. మన ఎంపికలు మనం ప్రభువును ప్రేమిస్తున్నామని మరియు ఆయన ప్రేమించేదానిని మనం ప్రేమిస్తున్నామని చూపినప్పుడు, మన హృదయాలలోనికి నూనె పోయబడుతుంది. పశ్చాత్తాపపడడం, యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క స్వస్థతను వెదకడం నుండి నూనె వస్తుంది.
“మరణించే లోపు చేయాలనుకున్న పనుల జాబితా” అని కొందరు పిలిచేదానిని మీరు నింపాలనుకుంటే, అది ఇదే: యేసు క్రీస్తు యొక్క జీవజలము రూపంలో మీ జాబితాను నూనెతో నింపండి,34 అది ఆయన జీవితం మరియు బోధనలకు ప్రతిరూపం. దానికి విరుద్ధంగా, మీ జాబితాలో ఆత్మీయంగా అంత ముఖ్యం కాని ఒకదానిని పూర్తిచేయడం మీ ఆత్మను ఎప్పటికీ సంపూర్ణంగా భావించనివ్వదు లేదా తృప్తిపరచదు; యేసు క్రీస్తు చేత బోధించబడిన సిద్ధాంతాన్ని జీవించడం తృప్తినిస్తుంది. ఇంతకుముందు నేను కొన్ని ఉదాహరణలు చెప్పాను: ప్రవచనాన్ని, ప్రవక్తల బోధనలను హత్తుకోండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణలపై పనిచేయండి, నిజమైన శిష్యులుగా మారండి మరియు మన ప్రభువు ప్రాయశ్చిత్తము యొక్క స్వస్థపరచు శక్తిని వెదకండి. మరణించే లోపు చేయాలనుకున్న ఆ పనుల జాబితా మీరు వెళ్ళాలనుకున్న చోటుకు—మీ పరలోక తండ్రి వద్దకు తీసుకువెళ్తుంది.
టకొరాడిలో ఆ మట్టల ఆదివారం నాకు చాలా ప్రత్యేకమైన అనుభవం, ఎందుకంటే నేను దానిని విశ్వాసులైన సహోదర సహోదరీల సమూహంతో పంచుకున్నాను. కాబట్టి ప్రపంచమంతటా ఖండాలలో, ద్వీపాలలో ఇటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. మీలాగే నా హృదయం, ఆత్మ కూడా “అత్యున్నతుడైన దేవుని నామము ధన్యమగును గాక”35 అని కేకవేయాలని కోరుతోంది.
యెరూషలేము ద్వారాల వద్ద ఈనాడు మనం మన చేతుల్లో ఖజ్జూరపు మట్టలు పట్టుకొని నిలబడకపోయినా, ప్రకటన గ్రంథములో ప్రవచించబడినట్లు, “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను [నిలువబడు]”36 సమయము వస్తుంది.
మీరు నీతిగా జీవించడానికి శ్రద్ధగా ప్రయత్నిస్తారని మరియు దేవుని కుమారుడు, మనందరి గొప్ప విమోచకుడిని స్వాగతించడానికి తమ చేతుల్లో ఖజ్జూరపు మట్టలు పట్టుకొనిన వారి మధ్య ఉంటారని యేసు క్రీస్తు యొక్క అపొస్తలునిగా నేను మీకు నా దీవెననిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.